పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు కక్కుర్తి ఏపీకి శాపంగా మారింది
  • కమిషన్ల కోసం కేంద్రం పెట్టిన షరతులు ఒప్పుకున్నాడు
  • వ్యవస్థను జగన్ గాడిలో పెడుతున్నాడు
చంద్రబాబు వల్ల పోలవరం ప్రాజెక్టు నాశనమైందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయని మండిపడ్డారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించారని... పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారంటూ సాక్షాత్తు ప్రధాని మోదీనే ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను జగన్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారని చెప్పారు.  

'పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు నిధులివ్వకుండా గాలికొదిలేసి ప్రైవేటు విద్యా సంస్థలను ఎగదోశాడు. తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పొరేట్ మాఫియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు బాబు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన ‘విజనరీ’ కదా!' అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాలేదని, గతంలో పోలవరంకు వ్యతిరేకంగా వైసీపీ ఫిర్యాదులు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు దీనికంతా గత టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు.

Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
Polavaram Project

More Telugu News